కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రైలు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుస్తోంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లాలన్నా అక్కడినుంచి తిరిగి రావాలన్నా వెయిటింగ్ లిస్ట్ భారీగానే ఉంటోంది. కాచిగూడ సహా దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడంతో విస్తృత ప్రచారం చేశారు. ఒకసారైనా ఈ రైలులో ప్రయాణం చేయాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. దీని టికెట్ ధర సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల టికెట్కన్నా ఎక్కువే అయినా లెక్క చేయకుండా ఇందులో ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతున్నారు. నిత్యం కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా మైసూరుకు వెళ్లే మామూలు ఎక్స్ప్రెస్ రైలు 24 బోగీలతో రాత్రివేళ నడుస్తుంది. ఇందులో బెర్త్ల సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో తక్కువ బోగీలు ఉంటాయి. అదికూడా పగటి పూట నడుపుతుండటం వల్ల బెర్త్లకు బదులు ఛైర్కార్ సదుపాయాన్ని కల్పించారు. దీనిలో సీట్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది.