విశాఖలో ఆకట్టుకుంటున్న నౌకాదళ విన్యాసాలు.. Navy Day - Tv9

నేవీ డే సందర్భంగా విశాఖలోని భారత నౌకాదళ వాయువిభాగం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ఏటా విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో డిసెంబర్‌ 4న నేవీ డే నిర్వహిస్తారు. తుపాను కారణంగా ఈ నెల 4న జరగాల్సిన వేడుకలను ఇవాళ నిర్వహించారు. భారత నేవీ వాయు విభాగం, సైన్యం ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విన్యాసాల ద్వారా భారత నేవీ పరాక్రమం, ప్రతిభా పాటవాలను ఘనంగా ప్రదర్శించారు. ఇందులో నేవీ కమాండోలు పాల్గొని తీర ప్రాంతానికి ముప్పు వాటిల్లితే ఎలా కాపాడేదీ ప్రదర్శించారు. ఇందులో తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, నేవీకి చెందిన బోట్లు, బీఎంపీ యుద్ధ ట్యాంకులు, మీడియం ల్యాండింగ్ షిప్పులు పాల్గొన్నాయి.