మధ్యప్రదేశ్ లో మాంసం, గుడ్లు అమ్మకాలు బంద్! - Tv9

మధ్యప్రదేశ్‌లో నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సారధ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తొలి రోజే సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్ల విక్రయాలపై నిషేధం విధించింది. ఆహార భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించనున్నామని, బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయించేవారిపై చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. జనాల్లో సరైన అవగాహన కల్పించిన తర్వాత ఈ మేరకు చర్యలు ఉంటాయని కేబినెట్ భేటీ అనంతరం సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. ఫుడ్ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్, స్థానిక పట్టణ సంస్థల అధికారులు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారని సీఎం చెప్పారు. డిసెంబర్ 15 నుంచి 31 మధ్య బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయంపై నిషేధం అమలవుతుందని చెప్పారు.